జడ్చర్ల మండలంలో విషాదం అడవి పంది దాడిలో రైతు మృతి
April 04, 2026
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ని ఉదండాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అడవి పంది దాడిలో తీవ్రంగా గాయపడిన బి. రామకృష్ణ అందాజ వయస్సు 50 సంవత్సరాలు అనే రైతు చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందారు.ఘటన వివరాల్లోకి వెళ్తే ఉదండాపూర్ గ్రామానికి చెందిన రామకృష్ణ శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో తన సొంత పొలానికి వెళ్లారు. ఆ సమయంలో పొలంలో ఉన్న ఒక అడవి పంది ఒక్కసారిగా ఆయనపై దాడి చేసింది. ఈ దాడి ఎంత భీభత్సంగా జరిగిందంటే రామకృష్ణ పొట్ట భాగంలో తీవ్ర గాయాలై పేగులు బయటకు వచ్చాయి.వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు మరియు స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్లో ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ, ఫలితం లేకపోయింది. శనివారం సాయంత్రం సుమారు 7:30 గంటల ప్రాంతంలో రామకృష్ణ మరణించినట్లు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ తెలిపారు.గ్రామంలోని రైతుపై అడవి పంది దాడి చేసి ప్రాణాలు తీయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి తమను అడవి జంతువుల బారి నుండి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Tags
