జడ్చర్ల, జులై 24: ఇంకుడు గుంతల ఏర్పాటు ద్వారానే భూగర్భ జలాలను పరిరక్షించుకోగలమని జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ గిరీష్ పేర్కొన్నారు. జడ్చర్ల మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఉదయ మెమోరియల్ హైస్కూల్లో వర్షపు నీటి నిల్వ, ఇంకుడు గుంతల ప్రాముఖ్యతపై విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఒక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ గిరీష్ మాట్లాడుతూ.. వర్షపు నీరు వృథాగా పోకుండా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీని ద్వారానే భూగర్భ జల మట్టాలు పెరిగి, భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని తెలిపారు. వర్షపు నీటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాల మనుగడకు ఇది ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ నీటి సంరక్షణ అంశంపై తమ చుట్టుపక్కల ప్రజల్లో అవగాహన కల్పించి, సమాజంలో చైతన్యం తేవాలని కోరారు.ఈ అవగాహన సదస్సులో మున్సిపల్ వార్డు ఆఫీసర్లు అశోక్ (ఈఈ), కృష్ణయ్య, శానిటేషన్ ఇన్స్పెక్టర్ శివశంకర్, పాఠశాల కరస్పాండెంట్ వీణ శివకుమార్ మరియు మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
