మహబూబ్నగర్ , జడ్చర్ల, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను జడ్చర్ల నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్చర్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గ ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ పడిన తపన వెలకట్టలేనిదని కొనియాడారు. ఆయన కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని గుర్తు చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించిందని, అలాగే రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టి సమున్నత గౌరవాన్ని కల్పించామని వివరించారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనకు, సామాజిక సమానత్వానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
